A homepage subtitle here And an awesome description here!

Monday, February 28, 2022

జాతీయ సైన్స్ దినోత్సవం

🔷జాతీయ సైన్స్ దినోత్సవం
National science day
      February 28🔷


రామన్‌ ఎఫెక్ట్‌ అనే అంశం పై నేచర్‌ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). 
జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డే గా పేర్కొంటారు. ప్రతి ఏడది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా పేరుగాంచిన సీవీ రామన్‌గా ( ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్) 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.

అంతే కాదు ఆయన చిన్నతనం నుంచి భౌతికశాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. 'నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..' అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్.
 భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. 1888 నవంబరు 7 న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్ చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

పద్దెనిమిదేళ్ల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనల పట్ల అయనకున్న అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆయన ఆరోగ్యం ఇంగ్లాండు వాతావరణానికి సరిపడదని తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఫైనాన్స్ విభాగంలో చేరిన సీవీ రామన్ 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు.
అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామన్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటీష్‌ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్ పరిశోధనలపై పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించాడు.

ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు.
అతని తల్లి పార్వతి అమ్మాళ్‌ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై సాగింది. విజ్ఞాన పరిశోధనలపై తృష్ణ‌తో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ‌లో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై 1921లో లండన్‌లో ఉపన్యాసాలు ఇచ్చాడు. శ్రోతల్లోని ఓ వ్యక్తి ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు హేళన చేశాడు.
దీంతో రామన్‌కు పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించాడు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.... సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు.

కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స కిరణాలు పరిశోధననిజమైనపుడు, కాంతి విషయంలోనూ నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.

ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నాడు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించాడు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెళ్లడించాడు.

దీంతో బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో రామన్‌ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆయన 1970 నవంబర్ 21 కన్నుమాశారు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి.

Friday, February 11, 2022

థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి




🌹"మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు... ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా...🌹




👉ప్రపంచంలో అత్యధిక పేటెంట్లు పొందిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను 1847 ఫిబ్రవరి 11 న అమెరికాలో జన్మించాడు. పుట్టినప్పుడు తల లావుగా, శరీరం పీలగా ఉంటే ఆ బిడ్డ బతకరని అప్పటి (మూఢ) నమ్మకం. ఎడిసన్ కు కూడా తల లావుగా శరీరం పీలగా ఉంటే ఇతను కూడా బతకడని ఇతని తల్లి నాన్సీ. తండ్రి సామ్యూల్ ఎడిసన్ అనుకున్నాడు. ఈమెకు ఆరు మంది పిల్లల్లో అప్పటికే ముగ్గురు చనిపోయారు. కాబట్టి ఎడిసన్ ఎక్కువ కాలం బతకడని అతని తల్లితోపాటు చుట్టు ప్రక్కవారు అనుకొన్నారు.

👉ఏడేళ్ళ వయసులో ఎడిసన్ కు విషజ్వరం వచ్చింది. తల్లి మరింత భయపడినది కానీ విషజ్వరం తగ్గిపోయినా చెవిటితనం మిగిలిపోయింది. ఇతని తండ్రి వ్యాపారంలో లాభాలు తగ్గిపోయినవి. 1859 లో పోర్టు హరన్ - డిట్రాయిట్ మధ్య రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. ఎడిసన్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. స్కూలులో ఎడిసన్ ఉపాధ్యాయులు బుద్ది హీనత కలిగిన వ్యక్తి గా పరిగణించారు. ఎడిసన్ తల్లికి ఉపాధ్యాయులు “ఇతనికి చదువు రాదు” అని చెప్పగా ఎడిసన్ తల్లి ఇంట్లోనే చదువు చెప్పుతూ ఎడిసన్ ను ప్రోత్సహించింది. ఎడిసన్ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. కేవలం మూడు నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్ళిన ఎడిసన్ కు తల్లే టీచర్ ఇల్లే బడి. బుట్టలో గుడ్లపై బాతు కూచుంటే పిల్లలు వస్తాయని తెలిసి ఒక రోజు తానే గుడ్లపై కూర్చున్నాడు. ఆ గుడ్లన్ని పగిలిపోయాయి. రెండు గండు పిల్లుల తోకలను రాపిడి చేయడం ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నించాడు. కరంట్ రాలేదు కానీ ఎడిసన్ కు గాయాలైతే అయ్యాయి. ప్రయోగాలతో ఇల్లు దడదడలాడేది. తండ్రి మందలించినా తల్లి వెనకేసుకొని వచ్చేది. మేధావుల జీవిత చరిత్రలు, వాళ్ళ పరిశోధనలు, ప్రాముఖ్యతలను శ్రద్దగా చదివేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పన్నెండేళ్ళ వయసులోనే వార్తా పత్రికలు అమ్మే ఉద్యోగంలో చేరి విరామ సమయంలో పుస్తకాలు చదివేవాడు. అచ్చుయంత్రం కొని స్వయంగా వార్తా పత్రికలను ముద్రించి అమ్మి వచ్చే డబ్బుతో ప్రయోగాలు చేసేవాడు. రైలులో లగేజీ బోగీలో చిన్న ప్రయోగాలు చేసేవాడు అయితే అక్కడ ప్రమాదం జరిగి ఉద్యోగం ఊడింది.

👉పదహారేళ్ళ వయసులో రైలో రోడ్ టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా రాత్రి షిప్టులలో వనిచేసేవాడు. 'తను నిద్ర పోలేదని’ హెడ్ ఆఫీసుకు ప్రతి గంటకు సిగ్నల్ ఇవ్వాలి. కానీ ఎడిసన్ గడియారం ప్రతి గంటకు సిగ్నల్ ఇచ్చేది. కొద్ది రోజులకు ఈ విషయం అధికారులకు తెలిసి ఉద్యోగం ఊడింది. ఈ గడియారమే ఎడిసన్ తొలి ఆవిష్కరణ.

👉పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు లేకపోయినా. తన తెలివి, పట్టుదలతో తంతి ద్వారా వార్తలు పంపేయంత్రాన్ని కనిపెట్టి గడియారపు పెండ్యులమ్ కు అనుసంధానం చేసి వార్తలను పంపేవాడు. 1868 లో అమెరికా కాంగ్రెస్ సభ కోసం “ఓట్ రికార్డర్” ను ఆవిష్కరించి పేటెంట్ పొందాడు. కానీ ఇది అవసరంలేదని కాంగ్రెస్ అనడంతో డబ్బు రాలేదు. కానీ ప్రజలకు అవసరంలేని ఆవిష్కరణను చేయరాదనే గుణపాఠంగా భావించాడు.

👉రెండు సందేశాలను ఏక కాలంలో తీసుకుపోగా 'డైస్లెక్స్' ను రూపొందించాడు. టెలిగ్రాఫ్ ద్వారా షేర్ల రేటును తెలుసుకొనే “స్టాక్ టిక్కర్” ను ఆవిష్కరించి 40,000 డాలర్లు సంపాదించాడు. ఇలా ఇరవై మూడేళ్ళకే ప్రముఖ ఆవిష్కర్తగా గుర్తింపు పొందాడు. ఒకేసారి 45 పరికరాల మీద పరిశోధన చేసి అందరి దగ్గర ప్రశంసలు పొందాడు. తంతి ద్వారా 2500 మాటలను ఒక నిమిషంలో పంపిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. తంతి ద్వారా నాలుగు సందేశాలను ఒకేసారి ప్రసారం చేయగలిగాడు. ఎడిసన్ తనవద్ద పరిశోధకురాలిగా పనిచేసే ఆమెకు మోర్స్ కోడ్ ద్వారా తన ప్రేమను తెలిపి వివాహం చేసుకొన్నాడు. తర్వాత అతని ప్రయోగాలలో భార్య చాలా సహకరించింది. టెలిఫోన్స్ బాగా పరిశీలించి శబ్దతరంగాలను విద్యుత్ తరంగా మార్చే మైక్రోఫోన్లు తయారు చేసాడు. తనకు చిన్నతనం నుండి చెవిటితనం ఉన్నా గ్రాంఫోన్ నిర్మాణం చేసి, మూకీ సినిమాలకు ధ్వనిని చేర్చాడు. విద్యూత్ బల్బును కనుక్కొని ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు వందల ప్రయోగాల తర్వాతనే విజయం సాధించాడు. డైనమో మొదలు స్విచ్ బల్బుల వరకు ఎడిసన్ తయారుచేసి విజయం సాధించాడు. “కైనెటోస్కోప్” కనిపెట్టి మనం చూసే దృశ్యాలను తెరపై చూపడమే కాకుండా ఫోనోగ్రాఫ్ ను ఉపయోగించి ధ్వనిని చేర్చి ప్రదర్శించాడు.

👉ఇలా దాదాపు 1098 ఆవిష్కరణలకు పేటెంట్ పొంది 2500 కోట్ల డాలర్ల డబ్బును సంపాదించి యావత్ ప్రపంచానికి సైన్స్ ఫలితాలను అందించిన ఎడిసన్ 1931 వ సం. అక్టోబర్ 18 న మరణించినా ఆయన చేసిన ప్రయోగవలితాలు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఈయన జయంతి సందర్భంగా ఎడిసన్ కృషిని తలచుకోవడమే ఆయనకు మనమిచ్చే నివాళులు.