Friday, February 11, 2022

థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి




🌹"మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు... ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా...🌹




👉ప్రపంచంలో అత్యధిక పేటెంట్లు పొందిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను 1847 ఫిబ్రవరి 11 న అమెరికాలో జన్మించాడు. పుట్టినప్పుడు తల లావుగా, శరీరం పీలగా ఉంటే ఆ బిడ్డ బతకరని అప్పటి (మూఢ) నమ్మకం. ఎడిసన్ కు కూడా తల లావుగా శరీరం పీలగా ఉంటే ఇతను కూడా బతకడని ఇతని తల్లి నాన్సీ. తండ్రి సామ్యూల్ ఎడిసన్ అనుకున్నాడు. ఈమెకు ఆరు మంది పిల్లల్లో అప్పటికే ముగ్గురు చనిపోయారు. కాబట్టి ఎడిసన్ ఎక్కువ కాలం బతకడని అతని తల్లితోపాటు చుట్టు ప్రక్కవారు అనుకొన్నారు.

👉ఏడేళ్ళ వయసులో ఎడిసన్ కు విషజ్వరం వచ్చింది. తల్లి మరింత భయపడినది కానీ విషజ్వరం తగ్గిపోయినా చెవిటితనం మిగిలిపోయింది. ఇతని తండ్రి వ్యాపారంలో లాభాలు తగ్గిపోయినవి. 1859 లో పోర్టు హరన్ - డిట్రాయిట్ మధ్య రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. ఎడిసన్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. స్కూలులో ఎడిసన్ ఉపాధ్యాయులు బుద్ది హీనత కలిగిన వ్యక్తి గా పరిగణించారు. ఎడిసన్ తల్లికి ఉపాధ్యాయులు “ఇతనికి చదువు రాదు” అని చెప్పగా ఎడిసన్ తల్లి ఇంట్లోనే చదువు చెప్పుతూ ఎడిసన్ ను ప్రోత్సహించింది. ఎడిసన్ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. కేవలం మూడు నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్ళిన ఎడిసన్ కు తల్లే టీచర్ ఇల్లే బడి. బుట్టలో గుడ్లపై బాతు కూచుంటే పిల్లలు వస్తాయని తెలిసి ఒక రోజు తానే గుడ్లపై కూర్చున్నాడు. ఆ గుడ్లన్ని పగిలిపోయాయి. రెండు గండు పిల్లుల తోకలను రాపిడి చేయడం ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నించాడు. కరంట్ రాలేదు కానీ ఎడిసన్ కు గాయాలైతే అయ్యాయి. ప్రయోగాలతో ఇల్లు దడదడలాడేది. తండ్రి మందలించినా తల్లి వెనకేసుకొని వచ్చేది. మేధావుల జీవిత చరిత్రలు, వాళ్ళ పరిశోధనలు, ప్రాముఖ్యతలను శ్రద్దగా చదివేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పన్నెండేళ్ళ వయసులోనే వార్తా పత్రికలు అమ్మే ఉద్యోగంలో చేరి విరామ సమయంలో పుస్తకాలు చదివేవాడు. అచ్చుయంత్రం కొని స్వయంగా వార్తా పత్రికలను ముద్రించి అమ్మి వచ్చే డబ్బుతో ప్రయోగాలు చేసేవాడు. రైలులో లగేజీ బోగీలో చిన్న ప్రయోగాలు చేసేవాడు అయితే అక్కడ ప్రమాదం జరిగి ఉద్యోగం ఊడింది.

👉పదహారేళ్ళ వయసులో రైలో రోడ్ టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా రాత్రి షిప్టులలో వనిచేసేవాడు. 'తను నిద్ర పోలేదని’ హెడ్ ఆఫీసుకు ప్రతి గంటకు సిగ్నల్ ఇవ్వాలి. కానీ ఎడిసన్ గడియారం ప్రతి గంటకు సిగ్నల్ ఇచ్చేది. కొద్ది రోజులకు ఈ విషయం అధికారులకు తెలిసి ఉద్యోగం ఊడింది. ఈ గడియారమే ఎడిసన్ తొలి ఆవిష్కరణ.

👉పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు లేకపోయినా. తన తెలివి, పట్టుదలతో తంతి ద్వారా వార్తలు పంపేయంత్రాన్ని కనిపెట్టి గడియారపు పెండ్యులమ్ కు అనుసంధానం చేసి వార్తలను పంపేవాడు. 1868 లో అమెరికా కాంగ్రెస్ సభ కోసం “ఓట్ రికార్డర్” ను ఆవిష్కరించి పేటెంట్ పొందాడు. కానీ ఇది అవసరంలేదని కాంగ్రెస్ అనడంతో డబ్బు రాలేదు. కానీ ప్రజలకు అవసరంలేని ఆవిష్కరణను చేయరాదనే గుణపాఠంగా భావించాడు.

👉రెండు సందేశాలను ఏక కాలంలో తీసుకుపోగా 'డైస్లెక్స్' ను రూపొందించాడు. టెలిగ్రాఫ్ ద్వారా షేర్ల రేటును తెలుసుకొనే “స్టాక్ టిక్కర్” ను ఆవిష్కరించి 40,000 డాలర్లు సంపాదించాడు. ఇలా ఇరవై మూడేళ్ళకే ప్రముఖ ఆవిష్కర్తగా గుర్తింపు పొందాడు. ఒకేసారి 45 పరికరాల మీద పరిశోధన చేసి అందరి దగ్గర ప్రశంసలు పొందాడు. తంతి ద్వారా 2500 మాటలను ఒక నిమిషంలో పంపిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. తంతి ద్వారా నాలుగు సందేశాలను ఒకేసారి ప్రసారం చేయగలిగాడు. ఎడిసన్ తనవద్ద పరిశోధకురాలిగా పనిచేసే ఆమెకు మోర్స్ కోడ్ ద్వారా తన ప్రేమను తెలిపి వివాహం చేసుకొన్నాడు. తర్వాత అతని ప్రయోగాలలో భార్య చాలా సహకరించింది. టెలిఫోన్స్ బాగా పరిశీలించి శబ్దతరంగాలను విద్యుత్ తరంగా మార్చే మైక్రోఫోన్లు తయారు చేసాడు. తనకు చిన్నతనం నుండి చెవిటితనం ఉన్నా గ్రాంఫోన్ నిర్మాణం చేసి, మూకీ సినిమాలకు ధ్వనిని చేర్చాడు. విద్యూత్ బల్బును కనుక్కొని ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు వందల ప్రయోగాల తర్వాతనే విజయం సాధించాడు. డైనమో మొదలు స్విచ్ బల్బుల వరకు ఎడిసన్ తయారుచేసి విజయం సాధించాడు. “కైనెటోస్కోప్” కనిపెట్టి మనం చూసే దృశ్యాలను తెరపై చూపడమే కాకుండా ఫోనోగ్రాఫ్ ను ఉపయోగించి ధ్వనిని చేర్చి ప్రదర్శించాడు.

👉ఇలా దాదాపు 1098 ఆవిష్కరణలకు పేటెంట్ పొంది 2500 కోట్ల డాలర్ల డబ్బును సంపాదించి యావత్ ప్రపంచానికి సైన్స్ ఫలితాలను అందించిన ఎడిసన్ 1931 వ సం. అక్టోబర్ 18 న మరణించినా ఆయన చేసిన ప్రయోగవలితాలు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఈయన జయంతి సందర్భంగా ఎడిసన్ కృషిని తలచుకోవడమే ఆయనకు మనమిచ్చే నివాళులు.


1 comment: