💐🖋️పరిణత ప్రజ్ఞామూర్తి, శతపత్ర’ యోధుడు,రంగస్థల నటుడు పండిత గడియారం రామకృష్ణ శర్మ గారి జయంతి సందర్భంగా
【 *చదివింది ఆరో తరగతి వరకే కావచ్చు, కాని ఆరు భాషల్లో అరుదైన పాండిత్యాన్ని సాధించిన° అఖండుడు గడియారం వారు. విశ్వవిద్యాలయాల్లో చదవకున్నా విశ్వవిద్యాలయాలు ఆయన ప్రతిభకు మెచ్చి గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన నాటి గవర్నర్ సూర్జిత్ సింగ్ బర్నాలా చేతుల మీదుగా డాక్టరేట్ పట్టానందుకున్న శర్మ అదే విశ్వవిద్యాలయంలో లిపి శాస్త్రం మీద పరిశోధన చేసిన పరిశోధకులకు పర్యవేక్షకులుగా ఉండటం ఎంతో అరుదైన విషయం* 】
✍️తెలుగు సాహితీ రంగంలో అగ్రగణ్యులు.. చరిత్ర, పురావస్తు పరిశోధకుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి గడియారం రామకృష్ణ శర్మ .
గన్నమరాజు గిరిజా మనోహర బాబు
శ్రీచాళుక్య నృపాది పాలితము, రాశీభూత విద్యాకళా
ప్రాచుర్యం బల దక్షిణా పథ పవిత్ర క్షేత్ర రాజంబు నా
ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు నాలంపూరు నందాంధ్ర వా
ణీ చాంపేయ సుమార్చనల్ జరుగుచుండెన్ నేత్రపర్వంబుగన్
✍️ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో తమ గంభీరమైన కంచుకంఠంతో కీ.శే. గడియారం రామకృష్ణ శర్మ గానం చేసిన స్వాగత కవితలోని తొలి పద్యం ఇది. ఈనాటికీ ఇంతటి మహాసభలు జరుగ లేదేమోనన్నంత వైభవంగా విశ్వనాథ, శ్రీశ్రీ దాశరథీ, కప్పగంతుల, కేశవ పంతుల వంటి సాహితీ దిగ్గజాలెందరో పాల్గొన్న నాటి సభకు ఆనాటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి సభలు ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల, మంత్రులు డా. మర్రి చెన్నారెడ్డి, వి.బి.రాజు వంటి రాజకీయ ప్రముఖులందరూ పాల్గొన్న ఆ సభలో కాళోజీ నా గొడవ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలే గాక, కవిసమ్మేళనాలు, పుస్తక ప్రదర్శనలు అనేకం జరిగాయి. నేటికీ పచ్చని జ్ఞాపకంగా నిలిచిపోయిన ఆ సభలకు కర్త, కర్మ క్రియ అన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలియైన గడియారం రామకృష్ణ శర్మ కావడం ఒక విశేషం.
✍️గడియారం రామకృష్ణ శర్మ 1919 మార్చి 6న అనంతపురం జిల్లా కదిరిలో కీ.శే. జ్వాలాపతి శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు
కొంతకాలం తాము జన్మించిన కదిరిలోనే ఉండి ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తూ తమ పితృవ్యులవద్ద అమరకోశం, కొంత సంస్కృతము చదివారు. ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి వరకు మాత్రమే చదివారు. అక్కడితో వారి పాఠశాల విద్య దాదాపు ముగిసిపోయినట్లే.
✍️కారణాంతరాల వల్ల వారు చిన్నతనాననే తమ స్వగ్రామాన్ని వదిలి అలంపురం రావలసివచ్చింది. నాటి నుండి తమ ఆజీవన పర్యంతము దక్షిణకాశిగా వాసికెక్కిన పరశురామక్షేత్రమైన అలంపురమే వారి స్థిర నివాసంగా మారింది.
✍️వారు రచించిన మన వాస్తు సంపద, భారతీయ వాస్తు విజ్ఞానము తెలుగు సిరి వంటి రచనలు వారికి ఈ విషయాల్లో ఉన్న విశేష జ్ఞానానికి చిహ్నాలు. భారతదేశ చరిత్ర వంటి రచనలు వారికి చరిత్ర పైనున్న అధికారాన్ని, ఆసక్తిని తెలియజేస్తున్నాయి. అలంపూరు శిథిలములు, దక్షిణ వారణాసి, అలంపూరు క్షేత్రము మొదలైన గ్రంథములు వారి పరిశోధనా పాటవానికి వారి నిర్దుష్ట సాహితీ మూర్తిమత్వానికి నిదర్శనాలు. మాధవ విద్యారణ్య స్వామి చరిత్రము పేర వారు రచించిన ప్రామాణిక చారిత్రక గ్రంథము లోతైన వారి అధ్యయన శక్తిని బహిర్గతం చేస్తున్నది.
✍️కేవలం చరిత్ర, శిల్పం, వాస్తు విజ్ఞానం వంటి గ్రంథాలకే పరిమితం గాక వారి ప్రతిభను ఇతర సాహిత్య రంగాల్లోనూ మనం దర్శించవచ్చును.
✍️సాహిత్య రంగంలో ఉన్న సృజనాత్మక, విమర్శనాత్మక రంగాల్లోనూ శర్మ ప్రతిభ రాణించింది. చిన్నతనాన్నే రాసిన ”చంద్రహాస” పద్యకావ్య రచనతో ప్రారంభమైన రచనా వ్యాసంగం చివరి వరకూ కొనసాగుతూనే వచ్చింది. తెలుగులో మాత్రమేగాక కన్నడ భాషలోనూ విస్తృత పాండిత్యం ఉన్న గడియారం వారు గదాయుద్ధ నాటకము, కన్నడ చిన్న కథలు అనే రెండు అనువాద గ్రంథాలను అందించారు. గదాయుద్ధ నాటకము కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచన. రెండు గ్రంథాలు అకాడెమీ వారే ముద్రించారు.
✍️కువలయానందసారము, పాంచజన్యము, దశరూపక సారము మొదలైన శర్మ రచనలు బహుళ ప్రచారము పొందినవి. తిక్కన, పాల్కురికి సోమనాధులను గురించి నెల్లూరు, హైదరాబాదులలో ప్రసంగించిన వారి ప్రసంగ వ్యాసాలు ఆయాకవులపై వారికున్న ప్రత్యయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.
✍️గడియారం అనేక సంస్థలలో పలుబాధ్యతలను నిర్వహించి కృతకృత్యులయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో వ్యవస్థాపక సభ్యులుగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా తెలంగాణ ఆంధ్రోద్యమం (1940-41) తాలూకా సంఘ బాధ్యులుగా అలంపురంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులుగా, అలంపురం తాలూకా రైతుసంఘం అధ్యక్షులుగా, రీజనల్ హిస్టారికల్ సర్వే కమిటీలో సభ్యులుగా,
ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడెమిక్ కౌన్సిల్ సభ్యులుగా, ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడెమీ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా కూడా ఇతోధిక సేవలందించిన సేవా ధురంధరులు గడియారం రామకృష్ణ శర్మ. ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ వారి విశిష్ట పురస్కారం మొదలుకొని వారి జీవితకాలంలో వారందుకున్న సన్మానాలు, సత్కారాలు లెక్కకు మిక్కిలి.
✍️వారి నాటకరంగాభిరుచి వారినొక మహా నటునిగా, వారి వ్యక్తిత్వము వారి నొక ఆదర్శ మూర్తిగా, వారి సంభాషణా చతురత వారినొక మహావక్తగా, వారి సామాజిక నిష్ఠ వారి నొక ఆరితేరిన యోద్ధగా రూపొందించినవి. వారి సమగ్ర మూర్తిమత్వ దర్శనం వారి చివరి రచనయైన వారి స్వీయచరిత్ర ”శతపత్రము” చదివితే కలుగుతుంది.
కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు.
✍️సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందాడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి, రంగస్థల నటుడు కూడా.
0 comments:
Post a Comment