Saturday, April 30, 2022

మహాకవి ‘శ్రీశ్రీ’ గారి జయంతి

🖋📖మహాకవి ‘శ్రీశ్రీ’ గారి జయంతి ........తెలుగు సాహితి ప్రపంచంలో అక్షర సమిధను ధారపోసిన కవి కర్షకుడు..📖✒


【"ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం"】

ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది. విప్లవ గీతాలైనా...భావాత్మక గీతాలైనా..దేశభక్తి గీతాలైనా....ప్రణయ గీతాలైనా..విరహగీతాలైనా...విషాద గీతాలైనా...భక్తి గీతాలైనా ఆయన కలం నుంచి అలవోకగా జాలువారుతాయి.

శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో సూర్యుని వలె తాను వెలుగుతూ తెలుగు సాహిత్యాన్ని వెలిగించినా అభ్యుదయ కవి, విప్లవ యోగి.

 #తెలుగు పాటకు కావ్య గౌరవం కల్పించిన  #మహాకవి.తెలుగు పాటకు #తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడు.విప్లవ కవిగా తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తునే... సినీ కవిగా తన రచనలతో ప్రేక్షకలపై పాటల జల్లులు కురిపించాడు. తన కలంతో సామాన్య మానవుడి బాధల్ని పాటల్లో వినిపించిన యుగకర్త శ్రీశ్రీ.* ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి కవితనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటూ సినీకవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. విప్లవ గీతాలను తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన మహా ప్రస్థాన కవి.  సమ సమాజ స్థాపన తన లక్ష్యం అంటూ తన కలంతో ప్రవచించిన ఆధునిక యుగ ప్రవక్త. ఆయన అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు
విశాఖపట్నం లో జన్మించాడు.

#శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటి పేరు శ్రీరంగం గా మారింది. శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లో జరిగింది. 1931లో మద్రాసు యూనివర్సిటీలో బి.ఏ పూర్తి చేశాడు.1935లో విశాఖలోని మిసెస్ ఎవిఎస్ కాలేజీలో డిమాన్స్టేటరుగా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలోను, నిజాం సంస్థానంలోను, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుంచి 1940 వరకు తాను రాసిన ‘గర్జించు రష్యా’, ‘జగన్నాథ రథ చక్రాలు’ వంటి గొప్ప కవితలను సంకలనం చేసి ‘మహా ప్రస్థానం’ అనే పుస్తకంగా ప్రచురించాడు.

#మహా ప్రస్థానం:

#తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన పుస్తకం గా శ్రీశ్రీ #మహాప్రస్థానం మిగిలిపోయింది.
ఇందులో ఉపయోగించిన పదబంధం, వాక్య నిర్మాణం ఇంకా మహాప్రస్థాన కవితలలో నిండిన సాహితి వస్తువులన్నీ చాలా గొప్పవి. మహాప్రస్థానం అంతా సామాజిక స్పృహను రగిలించేటట్లుగా ఉంటుంది....
విరసం కవిగా మరెన్నో రచనలు చేసినా శ్రీశ్రీ పేరు వినగానే గుర్తుకొచ్చేది మహాప్రస్థానమే.
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు
#మహాప్రస్థానా”నికి #యోగ్యతాపత్రం రాస్తూ “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నాడు చలం. అసలు ఎవరీ శ్రీశ్రీ. తెలుగులో కవిత్వం పేరెత్తగానే అందరి తలలూ ఆయనవైపెందుకు తిరుగుతాయి? “రెండు శ్రీల ధన దరిద్రుడు - కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అని వేటూరి అంటారు.

శ్రీశ్రీ సిరి #సిరి మువ్వలు:

#అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా... విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా....సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ అనేక భూమికలు పోషించాడు. సమరానికి నేడే ఆరంభం...ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటూ సందేశాత్మక గీతాలు నేటికి తెలుగు నేలపై ఏదో సందర్భంలో గుర్తించుకోని తెలుగు వారుండరు. మనసున మనసై  బ్రతుకున బ్రతుకై అంటూ మదిలోని భావాలను మనుసుతో ముడిపడిన బ్రతుకును ఆవిష్కరించిన అద్భుత కవి శ్రీశ్రీ.‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా! అంటూ సోమరి పోతులను జాగృతం చేసిన చైతన్య శీలి శ్రీశ్రీ. మాంగల్య బలంలోని ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అంటూ చందమామ పై రాసిన ఈ గీతం  శ్రీశ్రీ కలం నుంచి జాలు వారింది.

#అల్లూరి సీతారామరాజు’లో చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాట తెలుగు సినీ పాటల్లో ఆణిముత్యం లా నిలిచిపోయింది. ఈ మూవీలోని ఈగీతానికే తొలిసారి తెలుగు సినిమా పాటకు #జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు సినీ పాటకు తన రచనతో గౌరవం దక్కేలా చేసాడు శ్రీశ్రీ.
సినిమా పాటలలో తమదైన ముద్ర ను వేశారు. విప్లవ గీతాలతో పాటు, కొన్ని భావ కవిత్వం తో కూడిన యుగళ గీతాలను, జాతిని జాగృతం చేసే గీతాలను సినిమాలకు రాశారు. యే గీతం రాసినప్పటికి శ్రీశ్రీ గారి ముద్ర సినీ జగత్తు లో ప్రత్యేకం గా ఉండేది

#శ్రీ శ్రీ మహాకవి:

1952 లో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు.

#ప్రతి అంశాన్ని గురించి రచనలు చేసిన ఘనత ఈయన సొంతం.గద్యం కవిత్వంమే కాదు పద్య కవిత్వంలో కూడా శ్రీ శ్రీ గారిది అందెవేసిన చేయి.
1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఆ తర్వాత తెలుగు సాహిత్యం అంతటినీ నేను నడిపిస్తున్నాను అని సగర్వంగా చెప్పుకున్న కవి శ్రీ శ్రీ.
తన రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచిని... ఈ మహా ప్రస్థానా కర్త 1983 జూన్ 15న స్వర్గస్తులైనారు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించడంలో విజయం సాధించాడు శ్రీశ్రీ. ఆయన మన మధ్య లేక పోయిన ఆయన అందించిన సాహితి సౌరభాలు...విప్లవ రచనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ..సజీవంగానే ఉన్నాయి.


0 comments:

Post a Comment