Monday, January 2, 2023

వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) శుభాకాంక్షలు*

*వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) శుభాకాంక్షలు*






                
శ్లో!! వైకుంఠ పద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ! 
ఉత్తర ద్వార గమనే దేవస్య మధు విద్విషః! దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం!!

శ్లో!! జన్మరాహిత్య మమలం ప్రాప్నోతి సువినిశ్చితమ్! గరుఢారూఢ విష్ణోస్తు సేవా మోక్షఫల ప్రదా !!

శ్లో!! ఉత్తర ద్వార మాసీనం ఖగస్థం వేంకటనాయకం! యః పశ్యతి సభక్తాదౌ యాతివై పరమాం  గతిమ్!!

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి...

 సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే 👉 ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు... 

సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య  ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది.... 

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.... 

ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది..... 
  
పెరియాళ్వార్ కి పరమాత్మ గరుడవాహనారూఢుడై దర్శనమిచ్చినరోజు ఈవైకుంఠ ఏకాదశి... 

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు.... 

ముక్కోటి ఏకాదశి నాడే జగన్మోహినీ అవతారంతో పరమాత్మ  అమృతం పంచిన రోజుగా దేవాలయాలలో ముక్కోటి ముందురోజు  జగన్మోహినీ అలంకారము చేసి ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహిస్తారు..... 
            
మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది... 
గీతా జయంతి కూడా ఇదే రోజు ఆచరిస్తారు..... 

ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం, జాగరణ... అటు తర్వాత జపం, ధ్యానం. ఆచరించాలి.... 

మధు కైటభులనే రాక్షసులకు మహావిష్ణువు  తన వైకుంఠ ద్వారాలను తెరిచి  వైకుంఠ ప్రాప్తి కలిగించినరోజు వైకుంఠ ఏకాదశి రోజునే.... 

వారు వైకుంఠ ప్రాప్తి పొందటమే కాకుండా ఆరోజున  ఉత్తర ద్వారం కుండావిష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు పరమాత్మని కోరారు.. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు..... 

తిరుమలలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు..... 

పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి..... 
                
ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు.... 

అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది..... అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు..... ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.... 

ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.... 

వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు.... ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవైమూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణ వాక్యం.... 

ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక.... వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది.... వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం..... ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు...... ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది..... 

గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పారాయణ చేయటం వినటం విశేషఫలం....


వైకుంఠ_ఏకాదశి

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి... వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం..... ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది... 

చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠః" (వైకుంఠుడు) అయ్యాడు..... అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు - అని అర్ధాలున్నాయి.... 
       

పండగ ఆచరించు విధానం....👇

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు.... ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు.... ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు.... 

ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం... ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం.... ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం... 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే.....

ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. ....పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి....


ఏకాదశి వ్రతం నియమాలు....👇

దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి....ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి... అసత్య మాడరాదు. ...చెడ్డ పనులు, దుష్టఆలోచనలు చేయకూడదు.... ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి....అన్నదానం చేయాలి....

ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది....

వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.... ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.....

ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది....

 ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.... 

ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి...

                
శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవైఒక్కరోజులు జరుగుతాయి..... దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు..... విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు..... ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారు.....

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు.....ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు..... పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు....ఏటా రెండు రోజులూ తెరచే ద్వారం ఈసంవత్సరం నుండి భక్తుల కోసం పదిరోజులు తెరచి  శ్రీవారి దర్శనం  ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో అందిస్తున్నారు..... 
 
ఇన్ని రకాలుగా ప్రసిద్ధి వహించిందీ ఏకాదశి ! 

ఉత్తర ద్వార ప్రవేశంతో స్వర్గవాసం దక్కాలన్న ఆకాంక్ష భక్తుల్లో ఉంటుంది..... 

అందుకే తెల్లవారకముందే బారులు తీరుతుంటారు.... 

'ముక్కోటి’ దేవతలు ‘వైకుంఠ’స్వామి దర్శనానికి.... ఆరాటపడే ‘స్వర్గద్వార’ ఏకాదశి అత్యంత పుణ్యప్రద సందర్భం!!!

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

0 comments:

Post a Comment