Friday, May 20, 2022

తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం" శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి

💐💐"తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం"
 శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి   సందర్భంగా💐💐

"భవ్య గుణముల దివ్యఖనియ
భారతాంబకు ముద్దుబిడ్డయి
గాఢమైన స్వరాజ్యకాంక్షల
గండుమీరిన శూరుడాతడు
సరిసములులేనట్టి యాతడు
ప్రజలకున్ దేశాభిమానము
పంచిపెట్టిన నేతయాతడు"

#ఆంధ్రకేసరి.. ఆ పేరులోనే ఓ దర్పం.. ఆయన వర్తనలో కూడా తెలుగు పౌరుషం.. నిరాడంబరత.. నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదురించే గుణం.. నచ్చని ఏ అంశంపైనైనా నిప్పులు చెరిగేతత్వం.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. తన గుండెను తూపాకీ గొట్టానికి అడ్డుపెట్టి తెల్ల దొరలను సైతం తెల్లబోయేలా చేసిన సాహస సింహం, తెలుగు విలువల ప్రతాకం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు.

 #విద్యాభ్యాసం:

'టంగుటూరి ప్రకాశం' పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957)
నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'
అన్నాడా బావ గారు. చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యాడు.

#లాయర్ గా:

#మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆరోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.*
అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర, నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు.
లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించాడు.

#స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం:

లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు.
గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు.

#సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా:

1928 లో #సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన #ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు 
#ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

#ముఖ్యమంత్రి గా:

ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు(1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.
దురాశాపరుల మూలంగానూ,శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.

#ప్రకాశం బారేజ్:

బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే,రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టాడు.ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు.అందుకే ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.

#ఆత్మకథ "నా జీవిత యాత్ర":

ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర" పేరిట నాలుగు భాగాల పుస్తకంగా  విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.

#శాలువ నాకెందుకు!ఆ డబ్బుతో #అరటిపళ్ళు కొనితెస్తే......

అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే “ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!! “ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.

#అధికారం కోసం ప్రాకులాడలేదు....

ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 

85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని,
ప్రకాశం గారు1957, మే 20న పరమపదించాడు.

#ప్రకాశం జిల్లా ఏర్పాటు:

స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

#గౌరవం:

*ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల ‍, ఉన్నత పాఠశాల (1974) - అద్దంకి, ప్రకాశం జిల్లా .
*ఆంధ్ర కేసరి యువజన సమితి, సాంస్కృతిక కళా సంఘం 30-04-1962న రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి,పక్షాన ప్రారంభించబడింది.
*ఆంధ్ర కేసరి శత జయంతుత్సవ జూనియర్ కళాశాల 23-08-1972, పంతులు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ప్రారంభించబడింది.
*ప్రకాశం పంతులు గారి గౌరవార్ధం అక్టోబర్ 16,1972 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
*ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల 23.08.1994 లో వావిలాల గోపాలకృష్ణయ్య ద్వారా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి,పక్షాన ప్రారంభించబడింది.
*ప్రకాశం నగర్,కర్నూలు
*సత్యనారాయణపురం(విజయవాడ)లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలనందు 1వ తరగతి నుండి 10వతరగతి వరకు గలవు. ఈ పాఠశాల 1955-60 మధ్య కాలంలో మొదలుపెట్టబడింది.

#తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన " ఆంధ్రకేసరి"టంగుటూరి ప్రకాశం పంతులు గారిని  ప్రతిఒక్కరు గుర్తుచేసుకోవాలి.

0 comments:

Post a Comment