Monday, December 12, 2022

రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి వర్థంతి

🌷🙏రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి వర్థంతి సందర్భంగా🙏🌷





#ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు (ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019)ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి

#బాల్యం, విద్యాభ్యాసం:

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్సు) విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణంలోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతికశాస్త్రంలో బి.యస్‌సీ (ఆనర్స్) చేశారు.

#ఉద్యోగం:

మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో ఈ పత్రికకు మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తరువాత ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు.

#రచనా ప్రస్థానం:

మారుతీరావు రాసిన తొలి కథ ‘ఆశాజీవి’. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక ‘రేనాడు’లో 1954, డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు.

విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదో అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన ‘అనంతం’ ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు.

#ప్రధానమంత్రి రక్షణ నిధికి....

‘మనస్తత్వాలు’ నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషన్‌కు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి.. చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు.

#వందేమాతరం’:

చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం ‘#వందేమాతరం’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959, డిసెంబరు 16న ‘రాగరాగిణి’ అనే నాటకాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించారు. ‘పథర్ కే అన్సూ‘ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించారు.

#రచనలపై పరిశోధన:

ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన ‘కళ్ళు’ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి ఎం.ఫిల్, డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.

#వివాహం:

మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు.

#సినిమా ప్రస్థానం:

1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే సహాయ నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు.

#కుటుంబం:

వీరికి ముగ్గురు మగసంతానం. పెద్ద కుమారులు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్‌ లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్‌ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. 

#గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డు:

మారుతిరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డుని నెలకొల్పారు. ఉత్తమ నూతన దర్శకుడికి రూ: 1.50 లక్షలు నగదు బహుమతినీ, ప్రముఖ చిత్ర కారుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా రూ: 15 వేలు గొల్లపూడి మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహుమానం అందిస్తున్నారు. సునీల్‌దత్, నసీరుద్దీన్‌ షా, మృణాల్‌ సేన్, శ్యాంబెనగల్, జావెద్‌ అక్తర్, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ఇందులో ప్రసంగించిన ప్రముఖుల్లో ఉన్నారు.

#అవార్డులు:

మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఆరు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

#నంది అవార్డులు:

1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా
1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకి ఉత్తమ రచయితగా

1983లో ‘తరంగణి’ సినిమాకి ఉత్తమ హాస్యనటుడిగా
1989లో ‘కళ్ళు’ అనే రచన సినిమాగా వచ్చింది.. దానికి ఉత్తమ రచయితగా
1991లో ‘మాస్టారి కాపురం’ సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా
1994లో ‘ప్రేమపుస్తకం’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి.

2019, డిసెంబరు 12న మరణించాడు. వారి బహుముఖ ప్రజ్ఞత్వం గురించి ప్రత్యేకంగా పత్రికలు ప్రచురించాయి.

0 comments:

Post a Comment