Saturday, December 24, 2022

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి 🙏🌷

🌷🙏బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి  సందర్భంగా🙏🌷





#భానుమతి గారు పరిచయం అక్కరలేని ప్రసిద్ధ నట #శిఖామణి. ఒక్క మాటలో చెప్పాలంటే " తెలుగు సినిమా లో మహిళా #అష్టావధాని ". అవును భానుమతి గారు ఒక్క సినిమా నటి మాత్రమే కాదు, గాయని, నిర్మాత, భరణి స్టూడియో ఓనర్ , రచయిత ,సినిమా డైరెక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ .
భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు.
నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.

#నటిగానే కాదు... గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో మల్లెల మాలలు ఊగించింది… వెన్నెల డోలల్లో తేలించింది… భానుమతి గాత్రంలో జాలువారిన గానం వింటూ ఉంటే ఎంత హాయి!… వయసు మీద పడినా, భానుమతి గాత్రంలో ఏ మాత్రం తొణుకు బెణుకూ కనిపించలేదు… తరాలు మారినా, తన గానంలోని మాధుర్యం ఏమీ తరగలేదని నిరూపిస్తూ భానుమతి నటిగా, గాయనిగా సాగారు… మాతృభాష తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా, అభినయంతో పాటు గానంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ  సాగారు భానుమతి… నవతరం నటీమణులతో పోటీ పడి నటించడంలోనే కాదు, గాయనీమణులకూ దీటుగా గళం విప్పేవారు.

మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో #భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.

#తెలుగు వెలుగులు" శీర్షికలో.......
 
" చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు" - ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో "తెలుగు వెలుగులు" శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.

#విభిన్న కోణాలను......

కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి.

 ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో.

#బాల్యం-తొలి జీవితం:

1925 వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.

#సీనీరంగం:

1939 సంవత్సరంలో తొలిసారిగా "వర విక్రయం" అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన "కృష్ణప్రేమ", "స్వర్గసీమ" చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.

#మిస్సమ్మ సినిమాలో...

విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది.

#దటీజ్‌ భానుమతి!

ఎన్టీఆర్‌ గానీ, ఏఎన్నార్‌గానీ.. సినిమాలో ఆ రోజు షూట్‌ చేస్తున్న సీన్లో భానుమతిని టచ్‌ చేయాలంటే… ముందుగా అనుమతి తీసుకునేవారు.
షూటింగ్‌ ప్రారంభం కాకముందే వెళ్లి నెమ్మదిగా "మేడమ్‌! డైరెక్టర్‌ గారు ఈ రోజు షూట్‌లో మీ భుజం మీద చేయి వేయమని అంటున్నారు.. " అని నసిగేవారట.
"అలాగా!" అంటూ భానుమతి డైరెక్టర్‌ కేసి తిరిగి, "ఏమయ్యా? చెయ్యి వేయాలన్నావుట? ఏం కాస్త దగ్గరగా నిలుచుంటే సరిపోదా? " అనేది.
డైరెక్టర్‌ కాస్త బెదురుగా… "అంటే .. అమ్మా! ఈ పాత్రలు… బావామరదళ్లు కదా? వాళ్ల మధ్య కాస్త చనువు ఉంటుంది కాబట్టి.. భుజం మీద చేయి వేస్తే.. బాగుంటుందని.. " అని నసిగేవాడు.
"'సరే. అయితే! " అనేదావిడ.
అయినా షూటింగ్ సవ్యంగా పూర్తయ్యేవరకూ ఇద్దరు మహానటులకీ టెన్షనే! తేడా వస్తే అక్కడే కొడుతుంది మరి.

#కొందరు దర్శకులయితే భానుమతి తమ చిత్రంలో నటిస్తే చాలు అని అభిలషించేవారు… అలాంటి వారు పనికట్టుకొని మరీ ఆమె కోసం కొన్ని పాత్రలు సృష్టించేవారు.

#కుటుంబం:

1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.

#అవార్డులు:

అవార్డులు, రివార్డుల విషయానికి వస్తే... ఇప్పటిదాకా భానుమతిగారు మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయదుందుభిని మోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ‘కలైమామణి’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను అష్టావధానిగా పిలిచేవారు. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానేగాక, తన పాత్ర కు తానే పాటలు స్వయంగా పాడుకునేవారు.

#దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడుతరాల నటులతో పనిచేసిన భానుమతిగారు...  "మంగమ్మగారి మనవడు" చిత్రంలో నటించడమేగాక, ఆ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను కూడా పోషించారు. రచయితగా ఆమె రాసిన "అత్తగారి కథలు" ఆంధ్రలో విశేష ప్రాచుర్యం సంపాదించాయి. ఆ కథలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.

*****   *****
(అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం మదరాసు. నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు.
ఆమె ఇంట్లో, ఆమె మాటకు తిరుగు లేదు.
ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. ఆవిడను అమితంగా ప్రేమిస్తారు.
అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ  ఆవిడకు ఎవరూ సాటి లేరని ఆమె విశ్వాసం. అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోదు.
అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ.
బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం.
జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది.
"సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే" అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది.
నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు కోడలు గురించిన రచనలలో భానుమతి సృష్టి పరాకాష్ఠ.)
****       ****

#సాహిత్యం:

అంతేగాకుండా... భానుమతిగారు చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు "పద్మశ్రీ" బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భానుమతి కళాసేవను గుర్తించి ఆమెకు "కళాప్రపూర్ణ" బిరుదుతో డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఆమె ‘నాలోనేను’ అనే స్వీయ నవలను కూడా రచించారు. అత్తగారి కథలు, నాలో నేను,
అత్తగారూ, నక్సలైట్లూ
భానుమతి కథానికలు ఆమెలోని ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి.

తన #బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 2005వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆ రకంగా మహానటి శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయినా.. ఆమె గళం నుంచి జాలువారిన "కోతి బావకు పెళ్లంట", "ప్రేమే నేరమౌనా", "ఓ బాటసారి నను మరువకోయి", "శ్రీకర కరుణాల" గీతాలు మాత్రం ఎప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాయి.
#తెలుగు చిత్ర‌సీమ‌లోనే కాదు యావ‌ద్భార‌తంలోనే భానుమ‌తి వంటి బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన న‌టి మ‌రొక‌రు కాన‌రారు…. చిత్ర‌సీమ‌లో ఆమె ఖ్యాతి నిరంతరం వెలుగులు పంచుతూనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు… భానుమతి మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం…
💐🏵️

0 comments:

Post a Comment